E KYC : తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి సన్నబియ్యం కోటా పొందాలంటే.. కార్డులోని సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ నిలిపివేస్తామని.. 5 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపునిచ్చామని అధికారులు తెలిపారు.
- రేషన్ కార్డుదారులకు అలర్ట్
- డిసెంబర్ 31లాస్ట్ డేట్
- ఈ కేవైసీ చేయించుకోకుంటే సన్నబియ్యం కట్
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యం కోటాను పొందాలంటే.. కార్డులో పేరున్న సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. గత రెండు ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ఇంకా కోట్లాది మంది లబ్ధిదారులు అప్డేట్ చేసుకోకపోవడంతో ప్రభుత్వం డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ బియ్యం నిలిపివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే.. 5 ఏళ్ల లోపు చిన్నపిల్లలకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపునిచ్చారు.
ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లుగా ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 11.27 లక్షల కార్డులను పంపిణీ చేయగా.. సుమారు 34 లక్షల మంది కొత్త లబ్ధిదారులుగా చేరారు. పాత కార్డులకు సంబంధించి 80 శాతం కేవైసీ పూర్తయినప్పటికీ.. కొత్తగా మంజూరైన కార్డుల్లో కేవలం 40 శాతం మంది మాత్రమే బయోమెట్రిక్ పూర్తి చేశారు. గడువు దగ్గర పడుతుండటంతో రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని ప్రజల నుంచి విన్నపాలు అందుతున్నాయి.
ఈ-కేవైసీ అనేది కేవలం బియ్యం కోసమే కాకుండా.. ఇతర ప్రభుత్వ పథకాలకు ముఖ్యమైన కీ లాంటిది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికే సన్నబియ్యం లభిస్తుంది. దాంతో పాటు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలకు రేషన్ కార్డు లింకు ఉండటంతో ఈ కేవైసీ కంపల్సరీ చేశారు. భవిష్యత్తులో అమలయ్యే ఇతర సంక్షేమ పథకాలకు దీని ద్వారా అర్హత లభిస్తుంది.
కార్డులోని సభ్యులందరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులతో సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పాస్ (e-POS) యంత్రంలో వేలిముద్రలు వేయాలి. వేలిముద్రలు సరిగ్గా పడటానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. సాంకేతిక కారణాల వల్ల బయోమెట్రిక్ పడకపోతే అసహనం చెందకుండా మరో రోజు వెళ్లడం మంచిది. డీలర్లు కూడా దుకాణాల వద్ద అందుబాటులో ఉంటూ.. ప్రజలకు అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 11 లక్షల కార్డుదారుల్లో కొంత ఆందోళన నెలకొంది. పాత కార్డుదారులకు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ అందుతున్నాయని తమకు మాత్రం ఇంకా వర్తించడం లేదని వారు వాపోతున్నారు. అయితే, ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడం ద్వారా డేటా అప్డేట్ అయ్యి.. క్రమంగా అన్ని పథకాలు అందరికి వర్తిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
