గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో అసంతృప్తులు ఉన్నారని, పార్టీని వీడుతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్(Congress) జోష్ పెరగడం, బీజేపీ గ్రాఫ్ తగ్గిపోవడంతో బీజేపీ నాయకులు పార్టీ వీడతారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి(Vijayashanthi) బీజేపీని వీడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా బాగా ప్రచారం జరుగుతుంది.
తాజాగా విజయశాంతి ఈ వ్యాఖ్యలని ఖండిస్తూ ట్విట్టర్ లో ఫైర్ అయింది. సొంత పార్టీ నేతలపైనే ట్విట్టర్ లో రాములమ్మ ఆగ్రహం చూపించింది. బీజేపీకి తాను దూరమన్న ప్రచారాన్ని ఖండించింది విజయశాంతి.
విజయశాంతి తన ట్విట్టర్ లో.. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని. ఇదంతా తెలిసి కూడా కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం తప్పక ఖండంచదగ్గది అని తెలిపింది. దీంతో విజయశాంతి బీజేపీని వీడే ప్రసక్తిలేదని క్లారిటీ ఇచ్చేసింది.
Also Read : KCR: మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి, కారణమిదే!