రాష్ట్రంలోని చిన్నారులకు పోషకాహారం అందించేందుకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) చదువుతున్న 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ప్రతి రోజు ఉదయం అల్పాహారంగా ఉప్మా (Upma) అందించడంతో పాటు 100 మిల్లీ లీటర్ల పాలు (Milk) తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Telangana – Maharashtra Border : ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాలపై మళ్లీ రాజుకున్న వివాదం
పిల్లలలో పోషకాహారంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా “100 రోజుల న్యూట్రిషన్ మిషన్” ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. ఈ మిషన్ ద్వారా తల్లిదండ్రుల్లో కూడా పోషణపై అవగాహన పెంచనున్నారు. ఉదయం అల్పాహారంగా ఉప్మా వంటి తేలికపాటి కానీ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, పాలు వంటి ప్రోటీన్ పుష్కలంగా ఉన్న పానీయం అందించడం ద్వారా పిల్లల దైనందిన పోషణ అవసరాలు తీరుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన పలు సర్వేలు, అధ్యయనాల్లో చిన్నారుల్లో పోషకాహార లోపం స్పష్టంగా బయటపడింది. బరువు తక్కువగా ఉండటం, రక్తహీనత, ఎదుగుదల సమస్యలు గల చిన్నారుల సంఖ్య భారీగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఇప్పటి వరకు అంగన్వాడీల్లో ఒక పూట భోజనం, ఒక గుడ్డు మాత్రమే అందించగా, ఇప్పుడు అదనంగా పాలు, ఉప్మా లాంటి అల్పాహారం ఇవ్వాలన్న నిర్ణయం వల్ల వారి శారీరక, మానసిక అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఇది ఒక సానుకూల మార్గంలో తీసుకున్న కీలక చర్యగా భావించవచ్చు.