హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుబోతున్న వేళ.. బీజేపీ నేతలు ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం హైదరాబాద్ కు రానున్నారు. జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్నారు. రెండు రోజుల బీజేపీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో నగరంలోని పాత ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
జులై 2, జులై 3 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కార్యకర్తలు పాల్గొంటారు. ప్రధాని తన పర్యటనలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ నాయకులు అధికారిక ప్రకటన చేయలేదు. అటు జాతీయ సమావేశాలు, ఇటు బహిరంగ సభ ఉండటంతో భాగ్యలక్ష్మి ఆలయాన్ని విజిట్ చేయొచ్చు.. చేయకపోవచ్చు అనే తెలుస్తోంది. కానీ యోగి మాత్రం సందర్శించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా రాజ్భవన్ నుంచి హెచ్ఐసీసీ వరకు ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రాజ్భవన్లో బస చేయనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది.