Kavithas Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కవిత అరెస్టులో ఎలాంటి కుట్రకోణం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘‘ఇండియా టుడే’’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర హోం మంత్రి చెబితే.. దర్యాప్తు సంస్థలు వెళ్లి విపక్ష నేతలను అరెస్ట్ చేయడం లాంటివి అస్సలు జరగవు. కోర్టు ఆదేశాలను మాత్రమే దర్యాప్తు సంస్థలు పాటిస్తాయి’’ అని కేంద్ర హోం మంత్రి(Kavithas Arrest) తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ఎప్పటినుంచో జరుగుతోందని.. ఇప్పుడే కొత్త ఎపిసోడ్ మొదలు కాలేదన్నారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసులను విచారించడం వంటివి జరగవని అమిత్ షా అన్నారు. ‘‘కవిత అరెస్టులో కుట్రకోణం లేదు.. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరగలేదు’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమిత్ షా వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసేందుకు(Kavithas Arrest) శుక్రవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ‘‘కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు’’ అని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ప్రశ్నలకు ఈడీ అధికారులు ఎలాంటి సమాదానాలు చెప్పకుండా ..వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.