Tummala Nageshwara Rao : కాబోయే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు ? అంటే.. అది తుమ్మల నాగేశ్వరరావే అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తుమ్మల .. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసి ఆయన్ని మంత్రిని చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్లో చేరి ఖమ్మం నియోజకవర్గంలో తన చిరకాల ప్రత్యర్ధి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పై విజయఢంకా మోగించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో దాదాపు 48 వేల మంది కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు.
గతంలోకి వెళితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పువ్వాడ అజయ్కుమార్…తెలుగుదేశం తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును దాదాపు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ గూటికి చేరిపోయారు. ఆ తర్వాత కేసీఆర్.. తుమ్మలను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని అప్పగించారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మరోసారి ఓడిపోయారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచి గెలిచి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. పాలేరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నిరాకరించడంతో కొన్ని నెలల క్రితమే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఖమ్మం టికెట్ ఇవ్వడంతో.. తన పాత ప్రత్యర్థి పువ్వాడ అజయ్తో పోటీపడి గెలిచారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నందున ఆయనకు స్పీకర్ పగ్గాలు అప్పగిస్తారనే అంచనాలు(Tummala Nageshwara Rao) వెలువడుతున్నాయి.