Site icon HashtagU Telugu

TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం

TSRTC

TSRTC

TSRTC: ఇటీవల కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌లో జన్మించిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణాన్ని ప్రదానం చేసింది టిఎస్‌ఆర్‌టిసి. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో బుధవారం జూన్‌ 19న జరిగిన కార్యక్రమంలో నవజాత శిశువు జీవితకాల పాస్‌ను చిన్నారి తల్లి కుమారికి బహుమతిగా అందజేశారు టిఎస్‌ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్.

ఒడిశా నుంచి వలస వచ్చిన కుమారి, దూల దంపతులు పెద్దపల్లి జిల్లా కాట్నల్లి గ్రామంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. జూన్ 16వ తేదీ ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్ కు వెళ్లారు. భద్రాచలం వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. నిండు గర్భిణి అయిన కుమారికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. భర్త ఆమెను ఓ మూలకు తీసుకెళ్లి నేలపై పడుకోబెట్టి తమకు సహాయం చేయాల్సిందిగా ఆర్టీసీ కార్మికులను అభ్యర్థించాడు. బస్టాండ్‌లోని మహిళా స్వీపర్‌లు, సూపర్‌వైజర్లు మాహిళకు అడ్డుగా చీరలు కట్టి గర్భిణికి రక్షణ కల్పించారు. అంబులెన్స్ రాకముందే ఆర్టీసీ కార్మికులు నార్మల్ డెలివరీ చేశారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు.

ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందించడమే కాదు, మానవతావాదం ప్రదర్శించడంలో తాము ముందుంటామని ఆర్టీసీ మహిళా కార్మికులు మరోసారి నిరూపించుకున్నారు అని టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ప్రశంసించారు. సకాలంలో బిడ్డకు జన్మనివ్వడంలో సహకరించిన టిఎస్‌ఆర్‌టిసి సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్యల సేవలను సజ్జనార్ అభినందించారు.

Also Read: TJF: జర్నలిస్ట్ రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి