టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నా పత్రాలు లీక్ అవడం ఇటీవల సంచలనం సృష్టించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే నెలలో వివిధ విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల కోసం రిక్రూట్మెంట్ పరీక్షలను తిరిగి నిర్వహించనుంది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సబ్జెక్టుకు పరీక్ష, మే 9న అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనున్నాయి. అయితే సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షను మే 21న ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహిస్తారు.
బుధవారం జరిగిన సమావేశం తర్వాత కమిషన్ రిక్రూట్మెంట్ పరీక్షకు తాజా తేదీలను జారీ చేసింది. రిక్రూట్మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను పరీక్ష తేదీలకు ఒక వారం ముందు డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేసింది. ప్రశ్నపత్రం లీక్ కావడంతో జనవరి 22న ఏఈఈలకు నిర్వహించాల్సిన పరీక్షను రద్దు చేశారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 1,540 ఏఈఈల ఖాళీలను టీఎస్పీఎస్సీ నోటిఫై చేసింది.
Also Read: Ramakoti: రామకోటి రాయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?
మరోవైపు.. TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (AE), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO), టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (TPBO), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం తాజా రిక్రూట్మెంట్ పరీక్ష తేదీలను రెండు రోజుల్లో నోటిఫై చేయనుంది. ప్రశ్నాపత్రం లీక్ తర్వాత, TSPSC AE, DAO పరీక్షలను రద్దు చేసింది. TPBO, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది.