MLA Fund : సర్కారువారిబడి : ఎమ్మెల్యే నిధులతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి!

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధి (సీడీఎఫ్)లో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు 25 శాతం జమ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసే అవకాశం ఉంది

  • Written By:
  • Publish Date - November 18, 2021 / 02:37 PM IST

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధి (సీడీఎఫ్)లో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు 25 శాతం జమ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్‌రావు సభ్యులుగా నలుగురు సభ్యులతో కూడిన కేబినెట్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్లలో దీనికోసం రూ.4,000 కోట్లు అవసరమని కమిటీ అంచనా వేసింది.

అయితే, కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఆర్థిక అవరోధాలను ఎదుర్కొంటున్నందున ఇంత భారీ మొత్తాన్ని సమీకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో 25 శాతం ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించాలని కమిటీ ముందున్న ప్రతిపాదన. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు కేటాయిస్తోంది. కొత్త ప్రణాళిక ప్రకారం ప్రతి ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలకు ఏడాదికి రూ.1.25 కోట్లు కేటాయిస్తారు. ఈ విధంగా 119 మంది ఎమ్మెల్యేల నుంచి ఏటా రూ.148 కోట్లు సమీకరించవచ్చు. కమిటీ ప్రతిపాదనను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆమోదం కోసం వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో దాని ద్వారా నిర్వహించబడుతున్న పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడానికి, ఆధునీకరించడానికి రూ.4,000 కోట్ల పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘విద్యా రంగాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి, ఆధునీకరించడానికి ప్రభుత్వం విద్యా పథకాన్ని రూపొందించిందని, రాబోయే రెండేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని’ చెప్పారు. ప్రభుత్వం కొత్త భవనాలు నిర్మించడం, మరమ్మతు పనులు చేపట్టడంతోపాటు అవసరమైన ఫర్నీచర్, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుంది. తరగతి గదులను డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు.