Padi Koushik Reddy: కౌశిక్ తో కారుకు డ్యామేజ్!

హుజూరాబాద్ ఉపఎన్నికలో సీటు కోసం కాంగ్రెస్ పార్టీకే మస్కా కొట్టి…కేటీఆర్‌తో సీక్రెట్‌గా కలిసి

Published By: HashtagU Telugu Desk
Koushik Reddy

Koushik Reddy

హుజూరాబాద్ ఉపఎన్నికలో సీటు కోసం కాంగ్రెస్ పార్టీకే మస్కా కొట్టి…కేటీఆర్‌తో సీక్రెట్‌గా కలిసి…టీఆర్ఎస్ గెలుపు కోసం కౌశిక్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో రేవంత్ రెడ్డిని నాలుగు తిట్లు తిట్టేసి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. అయినా సరే సీటు దక్కలేదు…దీంతో చేసేదేమీ లేక టీఆర్ఎస్ ‌ని గెలిపించడం కోసం కౌశిక్ రెడ్డి గట్టిగానే తిరిగారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఈటలనే గెలిపించుకున్నారు. అయితే ఉపఎన్నిక తర్వాత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది…ఇక ఎమ్మెల్సీ పదవి రావడంతో హుజూరాబాద్‌లో తానే ఎమ్మెల్యేని అన్నట్లుగా కౌశిక్ రాజకీయం నడుస్తోంది. అన్నీ తన ఆధ్వర్యంలోనే నడిచేలా చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో హుజూరాబాద్ సీటు కోసం..ఈటలని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు.

అలాగే ఈటలపై సవాళ్ళు విసురుతూ ఉన్నారు…కానీ ఈటల మాత్రం…కౌశిక్ రెడ్డిని పట్టించుకోవడం లేదు. అయినా సరే కౌశిక్ తన రాజకీయం తాను చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఈ రాజకీయం వల్ల కౌశిక్‌కు ఎంత లాభం వస్తుందో తెలియదు గాని, టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా నష్టం జరిగేలా ఉంది. అసలే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ బలం తగ్గుతూ వస్తుంది..ఇలాంటి తరుణంలో కౌశిక్ చేసే రాజకీయం ఇంకా డ్యామేజ్ చేస్తుంది. తాజాగా టీఆర్ఎస్ జెండే మోసిన వాళ్ళకే పథకాలు అని, ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని కౌశిక్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హుజూరాబాద్ లోనే కాదు…రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి నష్టం. పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా టీఆర్ఎస్ కార్యకర్తలు…టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారు. ఇతర పార్టీ కార్యకర్తలకు పథకాలు అందిస్తే వారు టీఆర్ఎస్ వైపు చూపే అవకాశాలు ఉంటాయి. అలాగే న్యూట్రల్ వర్గాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తాయి. కానీ కౌశిక్ లాంటి నేతలు చేసే వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీని ముంచుతాయి.

  Last Updated: 30 Aug 2022, 03:42 PM IST