ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల ఆరో తేదీన హైదరాబాద్లోగానీ, ఢిల్లీలోగానీ సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీలో బయట పడ్డ మద్యం పాలసీకి సంబంధించిన స్కామ్లో విచారణ సందర్భంగా 14 మంది పేర్లు వచ్చాయని ఇందులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంత వివరణను ఇవ్వడానికి గానూ తమ ఎదుట హాజరు కావాలని కవితను సిబిఐ కోరింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ప్రగతి భవన్ కు వెళ్లిన ఆమె తన తండ్రితో భేటీ అయ్యారు. నోటీసులపై న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ (CM KCR) తో కవిత భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీలో ఏయే అంశాలు చర్చించనున్నారు. కేసీఆర్ ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ విషయంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం. కాగా ఈ నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నోటీసులు అందాయని, విచారణకు సహకరిస్తానని చెప్పారు. వారి అభ్యర్థన మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని కవిత తెలిపారు.