కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్ లో నగరానికి చెందిన MLC లు, MLA లు, TRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి లతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని మీడియా తో మాట్లాడుతూ గత కొంతకాలంగా ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని, ఈ తాటాకు చప్పుళ్ల కు తాము భయపడేదిలేదని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 27 వ తెలంగాణ భవన్ లో పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. మంత్రి వెంట MLC లు ప్రభాకర్ రావు, సురభి వాణి దేవి, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నియోజకవర్గ ఇంచార్జి లు ఆనంద్ గౌడ్, సలాఉద్దీన్ లోది, ప్రేమ్ సింగ్ రాథోడ్, నందు బిలాల్, శ్యామ్ సుందర్ రెడ్డి, జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.