KCR@National: జూన్ 19న జాతీయపార్టీ ప్రకటించనున్న కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నాడు. దానిలో భాగంగానే తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ‘భారత రాష్ట్ర సమితి’ అన్న పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీ విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో ప్రగతి భవన్‌లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్రపైనా చర్చ జరిగింది. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో మనం కీలక పాత్ర పోషిద్దామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి చర్చ జరగడం లేదని, మాట్లాడదామంటే ‘జైశ్రీరాం’ నినాదాలతో అడ్డుకుంటున్నారని, రాజకీయ లబ్ధికోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 97 శాతం అపజయాలు మూటగట్టుకుందని కేసీఆర్ గుర్తు చేశారు. దేశ ప్రజల అవసరాలు తీర్ఛె౦దుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని నేతలతో కేసీఆర్ అన్నట్టు సమాచారం.

జాతీయ పార్టీ ఏర్పాటు చేద్దామన్న కేసీఆర్ ప్రతిపాదనకు నేతలు కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నారని, నెలాఖరులో ఢిల్లీలో పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.