తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ‘ప్రజాప్రస్థానం పాదయాత్ర’ కొనసాగుతుండగా మరో పాదయాత్ర ప్రారంభం కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి చివరి వారంలో ‘సకల జనుల సంఘర్షణ యాత్ర’ పేరుతో రేవంత్ (Revanth Reddy) పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర 5 నెలల పాటు సాగనుందని సమాచారం.
కార్యకర్తల్లో ఉత్తేజం నింపి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ పేరుతో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. పాదయాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చీఫ్ రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే పాదయాత్ర తప్ప వేరే మార్గం లేదనే ఆలోచనకు రేవంత్ వచ్చినట్లు సమాచారం.
Also Read: T Congress: టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరం..!