రాజకీయ చదరంగంలో మాటల తూటాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, కౌంటర్లు, రియాక్షన్లు చాలా సర్వ సాధారణమే. అయితే ప్రత్యర్థి నాయకులను టార్గెట్ చేసే క్రమంలో తెలంగాణ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ పరుష పదజాలంతో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయ విమర్శలు కాస్తా వ్యక్తిగత దూషణలు చేసుకునే స్థాయికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth) నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాజకీయపరంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
పిసికితే ప్రాణం పోతది
“రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. వాడు నోటికి బట్టనే లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను వాడు వీడు అంటున్నాడు. వాడు ఉన్నది గింతంతా.. పిసికితే ప్రాణం పోతది. ప్రియాంక గాంధీ సభలో ఈ పొట్టోడు డిక్లరేషన్ గురించి మాట్లాడుతుండు.” అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ చేసిన వ్యాఖ్యలు (Hard Comments) తీవ్ర దుమారం రేపుతున్నాయి. “ఆరోజు సెక్రటేరియట్ మారుద్దామని చెప్తే పెద్ద ఎత్తున గొడవలు చేశారు.. కోర్టుకు ఎక్కారు… ఈరోజు సెక్రటేరియట్ వస్తామంటూ మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ యూఎస్ వైట్ హౌస్లా ఉందని తలసాని యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లంతా ఎక్కడైనా గుడి కట్టారా.. ఏమైనా చేశారా.. అంటూ తలసాని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు తలసాని.
పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి అంటూ..
తలసాని వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. తలసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదు.. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పశు కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసకడం అలవాటు అయినట్లుంది.. అందుకే తనను పిసుకుతాను అంటున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. చిన్ననాటి నుండి ఆయనకు పేడ పిసకడం అలవాటుగా ఉన్నట్లుందని వ్యాఖ్యనించారు. పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదని..మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రేవంత్. రాజకీయాలలో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలని హితవు పలికారాయన.
దిగొచ్చిన తలసాని
అయితే అంతకు ముందు తలసాని వ్యాఖ్యలు వైరల్ కావడంతో మరోసారి స్పందించారు ఆయన. రాజకీయ నాయకులు పార్టీలు వేరైనప్పటికీ విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదు అని రేవంత్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. ఇకనైనా నేతలు బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకుంటే బాగుంటుంది అని సూచించారు. విమర్శకు ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ తన వ్యాఖ్యలను తనే సమర్ధించుకునేలా చివర్లో మరో చురక అంటించారు.
Also Read: SSC Exam Results: టెన్త్ ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్, వికారాబాద్ లాస్ట్!