రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. గత 48 రోజులుగా నిరసనలు చేస్తున్న వీఆర్ఏలు కొందరు మరణిస్తున్నారని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేసీఆర్ను కోరారు. వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎంను డిమాండ్ చేస్తూ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రేవంత్ హెచ్చరించారు. అర్హులకు పదోన్నతులు కల్పించాలని, వారి స్వంత గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లు, ఆత్మహత్యలు చేసుకున్న లేదా విధి నిర్వహణలో మరణించిన వీఆర్వోల కుటుంబాలకు పరిహారం, కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వీఆర్ఏల పరిస్థితి దయనీయంగా ఉందని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వం హక్కులను కాపాడడం లేదని విమర్శించారు. గత కొన్నేళ్లుగా జీతాలు, పదోన్నతులు లేకుండా వీఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్ఏలలో 90 శాతం మంది బీసీలు, ఎస్సీలకు చెందినవారేనని రేవంత్ అన్నారు. 2020లో VRO వ్యవస్థను రద్దు చేసిన తర్వాత VRAలపై పని ఒత్తిడి పెరిగిందని ఆయన తెలిపారు.
గత 48 రోజులుగా వీఆర్ఏలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నల్లగొండ జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్య మరువకముందే, కామారెడ్డి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. నాగిరెడ్డి మండలానికి చెందిన రాగులు రవి ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
కేసీఆర్ మాటలు చాలా తియ్యగా ఉంటాయి. చేతలు మాత్రం కఠిక చేదుగా ఉంచాయి. వీఆర్ఏల జీతాలు, జీవితాలు ఉద్దరిస్తానని 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ‘
చచ్చినా’ కేసీఆర్ మాటమీద నిలబడడని మరోసారి రుజువైంది. pic.twitter.com/41jRtj0rON— Revanth Reddy (@revanth_anumula) September 11, 2022