Telangana Elections : రేపే (గురువారం) తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. రాష్ట్ర ఓటర్లు నవంబరు 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ తీర్పు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల పరిధిలో 19 ,375 పోలింగ్ కేంద్రాలను రెడీ చేశారు. వీటిలో 3 కోట్ల 26 లక్షల 98 వేల 418 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో పోలింగ్ కేంద్రాల చుట్టూ భారీగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాల మోహరింపు కంప్లీట్ అయింది. పోలింగ్ కేంద్రాలకు కొన్ని చోట్ల మూడు అంచెల భద్రత.. ఇంకొన్ని చోట్ల ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. యావత్ తెలంగాణ పోల్ వ్యూ ఇప్పుడు ఒకసారి చూద్దాం..
తెలంగాణ పోల్ వ్యూ
- రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఈవీఎం మెషీన్లను పోలింగ్లో వినియోగించనున్నారు. అదనంగా మరో 14 వేల ఈవీఎంలను రిజర్వ్లో ఉంచారు.
- తెలంగాణ ఓటర్లలో పురుషులు 1 కోటి 62 లక్షల 98 వేల 418 మంది.
- తెలంగాణలో మహిళా ఓటర్లు 1 కోటి 63 లక్షల 1705 మంది.
- తెలంగాణలో దివ్యాంగ ఓటర్లు 5 లక్షల 6 వేల 921 మంది.
- రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 12 వేలు. వీటిలో 1800 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
- రాష్ట్రంలో 600 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి.
- రాష్ట్రంలో 65 వేల మంది పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు.
- తెలంగాణలో 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.
- రాష్ట్రంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో కలిపి దాదాపు 70 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రిజర్వు ఫోర్స్, ఏఆర్, ఎస్పీఎఫ్కు చెందిన అదనపు యూనిట్లు కలిసి దాదాపు 30వేల మందికిపైగా బందోబస్తులో పాల్గొంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్లో ఐదు అంచెల భద్రత ఎలా ఉంటుందంటే.. ?
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ రోజు 391 రూట్ మొబైల్స్, 129 పెట్రోలింగ్ వాహనాలు, 122 ఇతర పోలీసు వాహనాలు గస్తీలో పాల్గొంటాయి.
- 9 టాస్క్ఫోర్స్, 9 స్పెషల్ ఫోర్స్ బృందాలు, 71 మంది ఇన్స్పెక్టర్లు, 125 మంది ఎస్సైల్ని సత్వర స్పందన బృందాలుగా విభజించి వేర్వేరు ప్రాంతాల్లో గస్తీలో ఉంచారు. అదనంగా 45 ఫ్లయింగ్ స్వ్కాడ్లతో, ముఖ్య ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
- పోలింగ్ రోజు ఒకవేళ ఎక్కడైనా ఘర్షణ జరిగినట్లయితే నిమిషాల వ్యవధిలో స్పందించేందుకు వీలుగా రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అంచెలవారీ భద్రతా విధానం అమలుచేస్తున్నారు.
- తొలిదశలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండే భద్రతా సిబ్బంది.. ఒకటి, రెండు నిమిషాల్లో స్పందిస్తారు.
- రెండోదశలో రూట్మొబైల్ నిరంతరం గస్తీలో ఉండి.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని సందర్శిస్తుంటారు.
- మూడోదశలో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక ఇన్స్పెక్టర్ నేతృత్వంలో క్విక్ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది.
- నాలుగోదశలో ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది.
- ఐదో దశలో డీసీపీ ఆధ్వర్యంలో రిజర్వు ఫోర్సు ఉంటుంది. పరిస్థితిని బట్టి క్షణాల్లో చేరుకునేలా బలగాలను(Telangana Elections) సిద్ధం చేశారు.