Site icon HashtagU Telugu

KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వ‌రంగ‌ల్ స‌భ‌లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!

KCR Speech Highlights

KCR Speech Highlights

KCR Speech Highlights: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు (KCR Speech Highlights) చేశారు. కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం తాను 25 ఏళ్ల క్రితం పోరాటం మొదలు పెట్టానని అన్నారు. అప్పుడు పుట్టిందే గులాబీ పార్టీ అని పేర్కొన్నారు. అయితే మొదట్లో గులాబీ జెండాను ఎంతోమంది అవమానపరిచారని పేర్కొన్నారు.

ఆప‌రేష‌న్ క‌గార్‌పై స్పంద‌న‌

నక్సలైట్ల అణచివేతపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను ఊచకోత కోయడం తగదని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. వారిని మారడానికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. మావోలను అంతమొందించడానికి ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’‌ను వెంటనే నిలిపివేయాలని కోరారు. దీనిపై బీఆర్ఎస్ తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. దీని కోసం కార్య‌క‌ర్త‌ల ఆమోదం తీసుకున్నారు.

HCU వివాదంపై మొదటిసారి స్పందించిన కేసీఆర్

ఇక‌పోతే దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన హెచ్‌సీయూ వివాదంపై కేసీఆర్ ఈ స‌భ వేదిక‌గా స్పందించారు. అత్యవసరం అయితే, ప్రభుత్వం భూములు అమ్ముకోవ‌చ్చ‌ని అన్నారు. ప్రజలకు అవసరం లేని భూములు అమ్మొచ్చని తెలిపారు. అయితే యూనివ‌ర్శిటీల జోలికి పోవ‌ద్ద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఇవాళ హెచ్‌సీయూ భూములు అమ్ముతారు.. రేపు ఓయూ భూములు కూడా అమ్ముతారా? అని ఫైర్ అయ్యారు.

Also Read: KCR Comments: నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.. రజతోత్సవ సభలో కేసీఆర్

నిజమైన రైతుబంధు కేసీఆర్

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా దృష్టి సారించారు. కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో తెలంగాణను “దగదగలాడించిన” విధానాన్ని గుర్తు చేశారు. గ‌త పదేండ్లలో రాష్ట్రాన్ని అందరూ ఆశ్చర్యపోయేలా నిర్మించాం అని పేర్కొన్నారు.

ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తున్నారని, హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. “అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది” అని జహీరాబాద్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదికల పేరుతో లీకులు చేస్తూ బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు. “నిజమైన రైతుబంధు కేసీఆర్” అని, రూ.80 వేల కోట్లు రైతులకు అందించిన ఘనత తమదేనని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ బీఆర్‌ఎస్ క్యాడర్‌ను ఉత్సాహపరిచారు. తెలంగాణ శక్తిని చూపించి కాంగ్రెస్‌ను ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. “నేను కొడితే మామూలుగా ఉండదు” అని హెచ్చరించారు. ఈ ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ దూకుడును సూచిస్తూ, ప్రజల్లో ఉత్సాహం నింపేలా ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.