Site icon HashtagU Telugu

GO 317 : 317 జీవోపై మంత్రివర్గ సబ్ కమిటీ.. ఛైర్మన్‌గా దామోదర

Go 317

Go 317

GO 317 :  తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండున్నరేండ్లుగా జీవో నంబరు 317తో  ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు-ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల లాంటి అంశాలను స్టడీ చేసి సిఫారసులు చేసేందుకు ఈ కమిటీని నియమించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన జీవో (నెం. 292) జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

మంత్రివర్గ సబ్ కమిటీకి ఛైర్మన్‌గా వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహరించారు. ఈ కమిటీలో మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.ఈ కమిటీకి కన్వీనర్‌గా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 (GO 317) ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ, వారు పనిచేస్తున్న హెచ్ఓడీలతోనూ, సంబంధిత డిపార్టుమెంట్ల సెక్రటరీలతోనూ కమిటీ చర్చించనుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్టుమెంట్ల సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరై సహకారం అందిస్తారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుంది.

Also Read : Income Tax – A Flat : నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా ? ఇవి తెలుసుకోండి

గత ప్రభుత్వం పది జిల్లాలను 31 జిల్లాలుగా మార్చినప్పుడు (అప్పటికి 33 జిల్లాలు లేవు) 2021 డిసెంబరు 6న జీవో నంబర్  317ను జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలవారీగా శాశ్వత ప్రాతిపదికన పోస్టింగులు ఇచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల (2018 నాటి) స్ఫూర్తికి అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించింది. ఉమ్మడి జిల్లాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాల్లోకి పంపేలా ఈ జీవోను జారీచేసింది.

Also Read : G Chinnareddy : చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

జీవో 317లో ప్రభుత్వం ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించేటప్పుడు (కేడర్ అలాట్‌మెంట్) స్థానికతను, కుటుంబ నేపథ్యాన్ని, భార్యాభర్తల ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపించాయి.భార్యాభర్తలు, కుటుంబ సభ్యులంతా ఒక జిల్లాలో ఉంటే ఈ జీవో కారణంగా దూరంగా ఉన్న మరో జిల్లాకు బదిలీ అవ్వాల్సి వస్తున్నదని, ఇది పర్మినెంట్ పోస్టింగ్ కావడంతో భవిష్యత్తు మొత్తం సొంత ఊరికి (జిల్లాకు), బంధువులకు సంబంధం లేని కొత్త జిల్లాల్లో గడపాల్సి ఉంటుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్ఎస్‌కు దూరం కావడానికి ఈ జీవో కారణమైందని, ఓటమికి ఇదీ ఒక ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే వాపోయారు.

Exit mobile version