Site icon HashtagU Telugu

IAS Officers : ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాల్సిందే.. ఐదుగురు ఐఏఎస్‌లకు షాకిచ్చేలా ‘క్యాట్’ తీర్పు

Telangana Ias Officers Cat

IAS Officers : తమ స్టేట్ క్యాడర్‌ను మార్చాలంటూ ఐదుగురు ఐఏఎస్‌‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కీలక తీర్పు ఇచ్చింది.  కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ గతంలో ఇచ్చిన తీర్పును తప్పకుండా పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది. బుధవారం రోజు ఎక్కడివాళ్లు  అక్కడ రిపోర్ట్ చేయాల్సిందే అని ఐదుగురు ఐఏఎస్‌లను ఆదేశించింది. కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ఐదుగురు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ క్యాట్‌లో వాదోపవాదనలు జరిగాయి.

Also Read :Debt Repayment : మీ అప్పులన్నీ తీరాలా ? ఈ పరిహారాలు పాటించండి

ఐఏఎస్ అధికారుల తీరును తప్పుపడుతూ  క్యాట్‌ (IAS Officers) కీలక కామెంట్స్ చేసింది. ‘‘ఏపీలో వరదలతో ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో వారికి సేవ చేయాలని మీకు లేదా’’ అని క్యాట్ ప్రశ్నించింది. ‘‘స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉందా’’ అని ఐఏఎస్ అధికారులను క్యాట్ నిలదీసింది. ఐఏఎస్‌లకు ఏయే క్యాడర్‌లను కేటాయించాలనే దానిపై కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖకు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని క్యాట్ పేర్కొంది. ‘‘వన్‌ మెన్‌ కమిటీ సిఫార్సులను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఎలా అమలు చేస్తుంది ?  వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు ?’’ అని ఐఏఎస్‌లకు క్యాట్‌ ఈసందర్భంగా ప్రశ్నలు సంధించింది.

Also Read :Atchannaidu : లిక్కర్‌ పాలసీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

క్యాట్ ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్ అధికారులు బుధవారం ఏపీ సీఎస్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఐఏఎస్ ఎలా స్పందిస్తారు ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనేది వేచిచూడాలి.  ఏపీ క్యాడర్‌కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో సేవలు అందిస్తున్నారు. వీరిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్‌తో పాటు పలువురు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ 11 మంది ఐఏఎస్‌లు ఇక్కడే పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసే ఛాన్స్ ఉందని సమాచారం. 11 మంది కీలక విభాగాల్లో పని చేస్తున్నారని.. వీరిని రిలీవ్ చేయడం వల్ల పాలనకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.