Rythu Bandhu : అసెంబ్లీ పోల్స్ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనాల పంపిణీపై కొంత ఎఫెక్ట్ పడుతోంది. ఆయా తేదీల్లో మార్పులు జరుగుతున్నాయి. ‘‘ఎన్నికలకు ముందు తెలంగాణలో రైతుబంధు నగదు పంపిణీకి అనుమతి ఇస్తే.. అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులను రిలీజ్ చేయకుండా చూడాలని “ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నర్స్” సంస్థ కూడా ఈసీని ఆశ్రయించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ వాదనను బీఆర్ఎస్ ఖండించింది. ‘‘రైతుబంధు ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకం. ఇది కొత్తదేమీ కాదు. రైతుబంధు కింద నగదు బదిలీకి అనుమతి ఇవ్వాలి’’ అని ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ సర్కారు కోరింది. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరికి రైతుబంధు నిధుల పంపిణీకి శుక్రవారం అనుమతిని మంజూరు చేసింది. ఈ నెల 30న పోలింగ్ ఉన్నందున.. 29,30 తేదీల్లో రైతుల అకౌంట్లలోకి నగదు పంపిణీ చేయకూడదని ఈసీ నిర్దేశించింది. నవంబరు 25,26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నందున.. 28న ఒకేరోజు రైతులందరి బ్యాంక్ అకౌంట్లలోకి రైతుబంధు డబ్బులు పడనున్నాయి. ఈ సీజన్ లో 70 లక్షల మందికి రైతుబంధు అందనుంది. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న(Rythu Bandhu) సంగతి తెలిసిందే.