KTR: చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం- కేటీఆర్

  • Written By:
  • Updated On - April 20, 2024 / 10:38 PM IST

KTR: నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు.

పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతోపాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తుందని తెలిపారు. 30 సంవత్సరాల పాటు బడుగు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ కి, ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యం అన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ గ్రామీణ ప్రాంతం నుంచి అంచలంచెలుగా ఎదిగి వచ్చిన, సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రంగారెడ్డి జిల్లా స్థానికుడు, రంగారెడ్డి ప్రజల కష్టసుఖాలు, అన్ని ప్రాంతాలపైన సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు జ్ఞానేశ్వర్ గారు అని కేటీఆర్ అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ చేవెళ్ల బహిరంగ సభ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయమైందని, ఈ దిశగా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాల పైన ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాల పైన చర్చించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అనుభవించి, పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసి వెళ్లిన రంజిత్ రెడ్డి తో పాటు మహేందర్ రెడ్డిల వైఖరిని ప్రజలు అసహించుకుంటున్నారని, పార్టీ కానీ, కెసిఆర్ కానీ వీరికి ఏం తక్కువ చేశారని ప్రశ్నిస్తున్నారన్నారు. ఒక పార్టీ పట్ల నిబద్ధతలేని నాయకులను ప్రజలు నమ్మరని, అధికారం కోసం జెండాలు మార్చే వాళ్ళని తిరస్కరిస్తారని కేటీఆర్ అన్నారు.