Data Stolen: దేశంలోనే అతి పెద్ద డేటా స్కామ్!.. 16.80 కోట్ల మంది డేటా భారీగా చోరీ..

దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా..

దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ (Data Stolen) అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

డేటా చోరీ (Data Stolen) కేసు దర్యాప్తులోని వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ స్కామ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. కేసులో కీలకమైన జస్ట్ డయల్ సంస్థపైనా కేసు నమోదు చేస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

‘‘నాగపూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు.. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించాం. బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాలని ప్రజలకు ఫోన్లు, మెసేజ్ లను నిందితులు చేస్తుంటారు’’ అని ఆయన వివరించారు.

వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు గుర్తించారు. ఇలా మొత్తంగా దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లకు నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా చోరీకి గురైనట్లు గుర్తించారు.

Also Read:  Bard by Google: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ప్రయోగాత్మకంగా యూఎస్‌, యూకేలో రిలీజ్