హనుమకొండలో హై టెన్షన్ (High tension) నెలకొంది. నిన్న రాత్రి టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కార్నర్ మీటింగ్ (Corner Meeting) ముగియగానే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ (Pawan)పై హత్యాయత్నం జరిగింది. బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు పవన్ను ఓ గల్లీలోకి తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ను ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీసీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్పై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రస్తుతం పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. హన్మకొండ (Hanumakonda)లో గత రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురైన యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ కుమార్ను టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరామర్శించారు. హన్మకొండలో పవన్ చికిత్స పొందుతున్న ఏకశిల ఆసుపత్రికి వెళ్లి.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రేవంత్ను చూసి పవన్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను ఓదార్చిన రేవంత్.. మెరుగైన వైద్యం కోసం పవన్ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులను కలిశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (MLA Vinay Bhaskar) అనుచరులు, గుండాలు పవన్పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడిగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.