కేసీఆర్ సారూ.. వీటికి జ‌వాబు చెప్పండి..

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సీఎం కేసీఆర్ కు ప‌ది ప్ర‌శ్న‌లు సంధించారు. వీటికి స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:34 PM IST

కేసీఆర్ పాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 31వ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లాల పరిధిలోని గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు జనం తరలి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ టీఆర్ ఎస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను గ‌ద్దె దించి బీజేపీనీ అధికారంలోకి తీసుకొస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న సీఎం కేసీఆర్ కు ప‌ది ప్ర‌శ్న‌లు సంధించారు. అవే ఏమిటంటే..

  1. జమానా అవినీతీ ఖజానా అని సకల జనులు ఘోషిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  2. మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ అవినీతి భవన్ గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందనేది వాస్తవం. దీనికి మీ సమాధానం ఏమిటి?
  3. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్ అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  4. 2014లో సీఎం అయ్యే సమయానికి మీవి, మీ కుటంబసభ్యుల ఆస్తులు ఎంత?
  5. ఇప్పుడున్న ఆస్తులు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?
  6. పాలమూరు-రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. వీటికి సంబంధించిన ఫైల్స్ అఖిలపక్షం ముందు పెట్టి బహిరంగంగా చర్చించడానికి మీరు సిద్ధమా?
  7. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా? లేదా? దీనికి మీ సమాధానం ఏమిటి?
  8. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను అవినీతి సొమ్ముతో మీరు సంతలో పశువుల్ని కొన్నట్టు కొనలేదా?
  9. బంగారు తెలంగాణ లక్ష్యమని చెప్పిన మీరు… అక్రమ మార్గాల ద్వారా కోట్లు కొల్లగొట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ పార్టీ నేతలను బంగారుమయం చేశారా? లేదా? ఇదే సమయంలో ప్రజలను బికారులుగా మార్చిన ఘనత మీది కాదా?
  10. మీరు సీఎం అయిన తర్వాత ఓటుకు నోటు పథకాన్ని ప్రవేశపెట్టి… సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న మాట నిజం కాదా?
    మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, డ్రగ్స్, లిక్కర్, భూకబ్జా దందాలపై దర్యాప్తు జరిపించి అవినీతి, అక్రమాలు జరగలేదని మీరు నిరూపించగలరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బాధ్యతగల పార్టీగా రేపు మరిన్ని ప్రశ్నలను సంధిస్తామని చెప్పారు.