Site icon HashtagU Telugu

Telangana Thalli Statue Unveiled : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Thalli Statue Unveiled at Secretariat

Telangana Thalli Statue Unveiled at Secretariat

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Thalli Statue) ఆవిష్కరించారు. సంప్రదాయ వస్త్రాలు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా చాకలి ఐలమ్మ, సారలమ్మల హుందా కనిపించేలా విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా మహిళలు పాల్గొనడంతో గ్రాండ్‌గా జరిగింది. విగ్రహ రూపకర్త గంగాధర్, శిల్పి రమణారెడ్డి(Gangadhar, Shilpi Ramana Reddy)ని ఈ సందర్భంగా సీఎం సన్మానించారు.

విగ్రహ రూపురేఖలపై అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ (CM Revanth) వివరాలు వెల్లడించారు. తెలంగాణ తల్లి రూపకల్పన రాష్ట్ర సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేసినట్లు తెలిపారు. చేతిలో తెలంగాణ పంటలు పట్టుకొని నిలుచునే విగ్రహం, రాష్ట్ర చరిత్రకు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. ఈ విగ్రహం తెలంగాణ ప్రత్యేకతను అందరికీ గుర్తు చేస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ తల్లి నిరాదరణకు గురైందని వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో వినిపించిన “జయ జయహే తెలంగాణ” పాట రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని ఆయన ముఖ్యంగా ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర గీతానికి తగిన గౌరవం దక్కలేదని సీఎం అన్నారు. అందుకే “జయ జయహే తెలంగాణ” పాటను అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించామని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి తెలియజేయడం తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షల ప్రకారం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు గుర్తుచేశారు. ఈ విగ్రహం ప్రజల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రత్యేక ఘట్టంగా రాష్ట్ర ప్రజల మదిలో నిలిచిపోతుందని అన్నారు.

Read Also : PCB : ఐపీఎల్ ఆటగాళ్ల కోసం డోర్లు తెరిచిన పీసీబీ