తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న కవిత, మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తూ సొంత పార్టీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన నూతన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని పేరు ఖరారు చేశారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ‘టిఆర్ఎస్’ అనే పేరును గుర్తుకు తెచ్చేలా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అస్థిత్వం కోసం ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.
మేడ్చల్ బహిరంగ సభ – జెండా ఆవిష్కరణ
ఈ ప్రకటనను మేడ్చల్లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో కవిత వెల్లడించారు. తన అనుచరులు, జాగృతి కార్యకర్తలు భారీగా తరలివచ్చిన ఈ సభలో మరికాసేపట్లో పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించనున్నారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను ఈ వేదికపై నుంచే ప్రకటించబోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మేడ్చల్ పరిసర ప్రాంతాలు పార్టీ కార్యకర్తలతో సందడిగా మారాయి.
రాజకీయ ప్రాధాన్యత – భవిష్యత్ పరిణామాలు
కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. బిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన క్రమంలో, మళ్లీ ప్రాంతీయ భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ పార్టీ ఉండబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన తండ్రి కె. చంద్రశేఖర రావు రాజకీయ వారసత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ఈ కొత్త పార్టీ ద్వారా ముందుకు తీసుకెళ్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త పార్టీ రాకతో ఇతర రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
