రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్ అయింది. అన్ని జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఇప్పటికే ములుగు, కొత్తగూడెం, మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో పోలీసు బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆపదలో ఉన్న పౌరులు అత్యవసర సహాయం కోసం 100కి డయల్ చేయవచ్చని.. తెలంగాణ పోలీసులు 24 గంటలూ ప్రజల సేవలో ఉంటారని డీజీపీ తెలిపారు.ఐజీపీ మల్టీ జోన్1 చంద్రశేఖర్ రెడ్డి బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లను సమన్వయం చేయడానికి కొత్తగూడెం వెళ్లనున్నారు.వరదల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు.