TPCC Vs Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ తెలంగాణ హైకోర్టును తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆశ్రయించింది. ఈమేరకు హైకోర్టులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారని పిటిషన్లో ప్రస్తావించారు. రాత్రి వేళలో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేశారని కోర్టుకు చెప్పారు. మే 4న తెల్లవారుజామున మండసాయి ప్రతాప్ ఇంటిపై ఢిల్లీ పోలీసులు రైడ్ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు చెందిన మొబైల్ ఫోన్లను కూడా ఢిల్లీ పోలీసులు లాక్కెళ్లారని చెప్పారు. ఫోన్లకు సంబంధించిన పాస్వర్డ్లను చెప్పాలంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని పిటిషన్లో టీపీసీసీ ప్రస్తావించింది. ఈ కేసు దర్యాప్తుపై కనీసం తెలంగాణ డీజీపీకి కూడా ఢిల్లీ పోలీసులు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును టీపీసీసీ(TPCC Vs Amit Shah) కోరింది.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తోంది.