నదీ జలాలపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను క్రమంగా కేంద్రం లాగేసుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా ప్రాజెక్టులను గెజిట్ ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ఇచ్ఛంపల్లి వద్ద ఎత్తపోతల పథకాన్ని నిర్మించడం ద్వారా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) ను కూడా తయారు చేసింది. సుమారు 80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోంది. గోదావరి నదిపై 250 టీఎంసీ అడుగుల నీటిని తోడేందుకు అవసరమైన ప్రాజెక్టు డిజైన్ పూర్తి అయింది.
గోదావరి నదీ హక్కులు కలిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అక్టోబర్ 28న కేంద్రం జలశక్తిశాఖ మంత్రి సమావేశాన్ని నిర్వహించి, వాళ్ల అంగీకారాన్ని పొందడానికి కేంద్రం ప్లాన్ చేసింది. ఈనెల 28న వర్చవల్ సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే ఏపీ, తెలంగాణ, చత్తీస్ గఢ్ , మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్ మరియు తమిళనాడు సీఎంలకు సమాచారం జలశక్తిశాఖ నుంచి అందింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరాలు వ్యక్తం చేయాలని ఆలోచిస్తున్నారు. కేంద్రం చేపట్టే ప్రాజెక్టు ఇచ్చింపల్లి వద్ద రాష్ట్రానికి 250 టీఎంసీ అడుగుల నీళ్లు తెలంగాణకు కావాలని, అలాంటప్పుడు ఎలా కేంద్రం నిర్మిస్తోందని అడుగబోతుంది. గోదావరి, కావేరి అనుసంధానం ప్రాజెక్టు పూర్తియితే తెలంగాణ ప్రాంతానికి సాగు, తాగునీళ్ల కొరత ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కేంద్రం మాత్రం వరంగల్, ఖమ్మం,నల్గొండ జిల్లాల్లోని 7.09 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను వచ్చేలా ప్రామిస్ చేస్తోంది. గోదావరి, కావేరి ప్రాజెక్టు అనుసంధానం కోసం ప్రాజెక్టును చేపట్టే ముందుగా కేంద్ర వాటర్ కమిషన్ ఆయా రాష్ట్రాలకు నీటి కేటాయింపులను తేల్చాలి. ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మించాలంటే కాల్వలకు, ప్రాజెక్టుకు చాలా భూమి అవసరం. తెలంగాణ ప్రాంతంలో చాలా భూమిని కోల్పోవలసి వస్తుందని ఆందోళన మొదలయింది. కృష్ణా జలాల మీద పట్టు సాధించిన కేంద్రం, గోదావరి జలాల మీద పట్టుబిగిస్తోంది. నదుల అనుసంధానం బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. అదే ఇప్పుడు సాకారం కాబోతుందన్నమాట.