టీకాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను న్యూఢిల్లీలో కలిసినప్పటికీ, టిపిసిసి స్టార్ క్యాంపెయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాబోయే మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా క్యాంపెనింగ్ చేయకపోవచ్చుననే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రియాంకతో సమావేశానికి రాకపోవడానికి గల కారణాలను వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో వివరించడంతో.. కాంగ్రెస్ హైకమాండ్ కోమటిరెడ్డితో చర్చలు జరపడానికి మొగ్గు చూపింది.
ప్రియాంక గాంధీతో 40 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా తమ భేటీ వివరాలను వెల్లడించబోనని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే దానిపై చర్చించినట్లు చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల గురించి ప్రశ్నించగా, మునుగోడుపై మా చర్చ గురించి నేను మాట్లాడను, మీరు అడగవద్దు అని అన్నారు. అయితే చెరుకు సుధాకర్ పార్టీలోకి చేర్చుకోవడానికి కోమటిరెడ్డి నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.