తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా పేరొందిన ఎన్టీఆర్ పేరు మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 45 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ను కలిశారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని గతేడాది నిర్ణయించారు. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించేందుకు రూ. 4 కోట్లు వెచ్చిస్తున్నారు. మంత్రి పువ్వాడ, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, ఖమ్మం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, తానా సభ్యులు, ప్రవాసాంధ్రులు, కొందరు పారిశ్రామికవేత్తలు ఈ విగ్రహ నిర్మాణంలో ఆర్థికంగా భాగస్వాములయ్యారు.
Also Read: Priyanka Chopra: వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ అన్ని రూ. కోట్లా?
ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి కావడంతో ఆ రోజున ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు మంత్రి పువ్వాడ, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనతో ఖమ్మం పట్టణం పర్యాటకంగా ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు.