Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ‘ఆర్ఆర్’ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కౌంటర్ చేశారు. డబుల్ ‘ఏ’ (ఏఏ) గురించి గుర్తుంచుకోవాలని ప్రధాని మోడీకి ఆయన సూచించారు. ‘ఏఏ’ అంటే ‘అదానీ, అంబానీ’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డెఫినేషన్ ఇచ్చారు. దేశ సంపదను వారిద్దరికి మోడీ దోచిపెట్టారని ఆరోపించారు. ఒకప్పుడు అదానీ అంటే ఎవరికీ తెలియదని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ పేరు చేరిందని ఆయన చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkatreddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనతో టచ్లోకి వచ్చారని ఆయన తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. తనకు పదవులపై ఆశ లేదని, వచ్చే పదేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు నేను కనీసం గది నుంచి కాలు బయట పెట్టలేదు. కొందరు ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసుకున్నారు. నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళలేదు’’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన లిక్కర్ స్కాం వల్ల తెలంగాణ పరువు పోయిందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కవితను చూస్తే నవ్వు వస్తోందన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని… కానీ బతుకమ్మలో బ్రాండీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని గుర్తించలేకపోయామని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 154కు చేరుతుందని, వాటిలో 125 కాంగ్రెసే గెలుస్తుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉంది. అయినప్పటికీ తలసాని మంత్రి ఎలా అవుతాడు? కేసీఆర్ని ఫుట్బాల్లా ఆడుకుంటానన్న తలసాని..ఆ తర్వాత మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడు’’ అని ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.