Lendi Project Completion: మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న లెండి ప్రాజెక్ట్ (Lendi Project Completion) నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రవీంద్ర చవాన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ రావు పాటిల్, సురేష్ పండిత్ వార్, సుభాష్ బాద్, వాకిడిష్వార్, దినేష్ అవాజ్, సందీప్ పాటిల్, తదితర మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలసి లెండి భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 1984 ప్రాంతంలో రూ. 2183.88 కోట్ల అంచనా వ్యయంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా వద్ద ప్రారంభించిన లెండి భారీ ప్రాజెక్ట్ పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రంలో 38573.15 ఎకరాలు, మహారాష్ట్రలో 27710.397 ఎకరాలు సేద్యంలోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ పై రూ. 1040.87 కోట్ల ఖర్చు చేసి ఎర్తేన్ డ్యామ్ వర్క్ 70%, స్పిల్ వే 80% పూర్తి కాగా కాలువల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
Also Read: Ranji Trophy: పిచ్ మాత్రమే మారింది.. మన స్టార్ ఆటగాళ్ల ఆట కాదు!
భూ అంతర్బాగం నుండి వైపులా ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే కాలక్రమంలో భూనిర్వాసితులు అడ్డు పడడంతో 2011లో అర్దాంతరంగా నిలిపివేయబడిన పనులను తిరిగి పునరుద్దరుంచడంతో నది గర్భంలోని మట్టి పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల ఒప్పందంలో భాగంగా వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.