షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరగాల్సిందే..

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై నెలకొన్న సందేహాలు వీడాయి. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు.

  • Written By:
  • Publish Date - October 23, 2021 / 01:33 PM IST

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై నెలకొన్న సందేహాలు వీడాయి. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్ వేస్తే ఎలా అని ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్‌ను తల్లిదండ్రుల సంఘం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 25 నుంచి షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, ఈ ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోదని చెప్పింది. పరీక్షలను రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన కోర్టు, పరీక్ష ప్రక్రియను నిలిపివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు జరిపేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,768 కేంద్రాల్లో సుమారు 4.58 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ -19 భద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రైవేటు కళాశాలలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం ముందుగా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ సంస్థలు పట్టుబడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ కారణంగా తామెంతో బాధపడుతున్నామని సంస్థల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 315 కోట్లు బకాయిపడింది. అయితే ఈ నేపథ్యంలో పరీక్షలను బహిష్కరించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని TSBIE కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు.