జాతీయ కార్యవర్గ సమావేశాలతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి నిన్న భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరి కలయిక రాజకీయంగా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. త్వరలో ఆమె కాషాయ తీర్థాన్ని పుచ్చుకోకున్నట్ట తెలుస్తోంది.
రచనా రెడ్డి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు, బీజేపీ చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. రచనా రెడ్డి న్యాయవాదిగా తనదైన ముద్ర వేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రచనా రెడ్డి వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు కూడా. రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీ వైపు రచనా రెడ్డి మొగ్గు చూపుతున్నారు.