కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న `దర్యాప్తు సంస్థల` వార్ క్లైమాక్స్ కు చేరింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం సోమవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సిట్ కార్యాలయానికి ఉదయం 10.30గంటలకు చేరుకోవాలి. హాజరుకాకపోతే 41 ఏ (3), (4) సెక్షన్ల కింద అరెస్టు చేసే అధికారం ఉందని సిట్ నోటీస్లో స్పష్టం చేసింది. విచారణకు బీఎల్ సంతోష్ హాజరు అనుమానమే.
తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం సంతోష్ నగరానికి వస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఒక వేళ ఆయన వస్తే సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారా? లేదా? అనేది ఉత్కంఠకు తెరలేపుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలులో ప్రమేయం ఉన్నట్టుగా అనుమానిస్తోన్న భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకులు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని టీమ్ విచారణను వేగవంతం చేసింది.
Also Read: DHO Srinivas Sensational Comments: సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా… మీకేమైనా ప్రాబ్లమా?
నోటీసులను అందుకున్న బీజేపీ నేతల్లో కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉండడం కీలకంగా మారింది. ఇంకో వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. అనూహ్యంగా డ్రగ్స్ కేసును కూడా తిరగతోడే అవకాశం ఉందని తెలుస్తోంది. అపట్లో హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన సమాచారం వరకు ముంబై డ్రగ్స్ కేసుకు, హైదరాబాద్ కు లింకు పరిమితం అయింది. కొనసాగింపుగా మళ్లీ డ్రగ్స్ కేసును బయటకు తీయడానికి కేంద్రం సిద్దం అవుతుందని తెలుస్తోంది. మొత్తం మీద కేంద్రం, రాష్ట్రం చేస్తోన్న దర్యాప్తుల వ్యవహారం క్రైమాక్స్ కు వచ్చింది. సీరియస్ గా ఈ కేసుల విచారణ జరుగుతుందా? లేక గత కేసుల మాదిరిగా బుట్టదాఖలు అవుతుందా? అనేది చూడాలి.