Farmers Loan Waiver : త్వరలోనే రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసే క్రమంలో రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేయనుంది. రుణమాఫీ సొమ్మును అర్హులైన రైతుల ఖాతాల్లో జులై 15 నుంచి ఆగస్టు 15లోగా విడతల వారీగా జమ చేసే దిశగా నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. తొలుత రూ.50వేలలోపు లోన్లు ఉన్న రైతులతో ఈ ప్రక్రియను మొదలుపెడతారని అంటున్నారు. నిధులు అందుబాటులోకి రాగానే తదుపరిగా రూ.75 వేలు, రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడంపై రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టనుంది. రాష్ట్రంలోని రైతుల్లో 70 శాతం మందికి రూ.లక్షలోపే రుణ బకాయిలు(Farmers Loan Waiver) ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రైతు సంక్షేమ పథకాల అమలు కోసం 2 నెలల్లోగా రూ.30వేల కోట్లు అవసరమని తెలంగాణ సర్కారు అంచనా వేస్తోంది. ఈ నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈవిషయంలో రిజర్వు బ్యాంకుతో సంప్రదింపులు జరపడంతో పాటు అవసరమైతే ప్రభుత్వ భూములను తనఖా పెట్టాలని భావిస్తోంది.
రైతు రుణమాఫీపై గైడ్లైన్స్ను ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి త్వరలోనే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపైనా ఆ మీటింగ్లో కసరత్తు చేయనున్నారు. ఈ ప్రక్రియను మొదలుపెట్టే క్రమంలో ఇప్పటికే రోజూ పదుల సంఖ్యలో రైతులు, రైతుసంఘాల నేతలతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంపన్నులకు రైతుబంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సీఎంకు సూచనలు వచ్చాయట. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులకు ఇస్తున్న పథకాలపై ఇప్పటికే అధికారుల టీమ్ అధ్యయనం చేసి వచ్చింది.
రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతు భరోసా సాయం అందించే దిశగా అడుగులు వేయనుంది. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి, అసెంబ్లీలో చర్చించి నూతన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం ద్వారా పొలం ఉన్న ప్రతి రైతుకీ పెట్టుబడి సాయం అందేది. రైతు బీమా కూడా వారికే దక్కేది. దానివల్ల అనర్హులైన రైతులకు కూడా రైతుబంధు సాయం పడుతోందనే విమర్శలు వచ్చాయి. ఇకపై ఇలా అనర్హులకు లబ్ధి చేకూరదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.