New CPs : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖలో బదిలీలు, నియామకాలపైనా ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే మూడు కమిషనరేట్లకు నూతన కమిషనర్లను నియమించింది. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మొహంతీ, రాచకొండ సీపీగా సుధీర్ బాబును(New CPs) నియమించారు. యాంటీ నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్గా సందీప్ శాండిల్యను నియమించారు. సందీప్ శాండిల్య.. ఎన్నికల వేళ హైదరాబాద్ సీపీగా పనిచేశారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకూ తెలంగాణ ఆర్గనైజేషన్స్ అండ్ లీగల్ విభాగానికి అడిషనల్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడాయన హైదరాబాద్ సీపీ అవుతున్నారు. ఐపీఎస్ సుధీర్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు రాచకొండ సీపీగా బదిలీ అయ్యారు. అవినాష్ మొహంతీ సైబరాబాద్లో జాయింట్ సీపీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు సైబరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. వీరందర్నీ వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.మరోవైపు తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి కూడా కసరత్తు జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్పై విధించిన సస్పెన్షన్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని ఈసీకి అంజనీ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ సస్పెన్షన్ను ఎత్తివేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన టైంలో రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్ ఉన్నారు. ఫలితాలు వెలువడుతుండగా వెళ్లి రేవంత్రెడ్డిని కలవడంతో ఆయనను ఈసీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం ఆయనే డీజీపీగా కొనసాగుతుండగా.. ఇప్పుడు అంజనీ కుమార్పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో ఆయన్ను మళ్లీ డీజీపీగా నియమిస్తారా? ఏ పోస్టు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.