LRS Scheme : 2020 – లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే ఔట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు కొత్తగా అప్లై చేసుకునేవారికీ మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలో రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి లే ఔట్లను వేయడంతో ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం అనుమతి లేని లే ఔట్లను మాత్రమే ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా రెగ్యులరైజేషన్ చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల విషయంలో క్రమబద్ధీకరణ కుదరదని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం LRS తీసుకురాగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉండటంతో.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ (LRS) వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. అనుమతి లేకుండా చేసిన లే అవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్దీకరించుకునేందుకు సర్కార్ మరోసారి అవకాశం కల్పించింది. అనధికార లే ఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మాణానికి అనుమతులు రాక, అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో ఆయా లే ఔట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీం తీసుకొచ్చింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ విషయంపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లే ఔట్ల కోసం ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది.