Good News : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీని వర్తింపచేయాలని డిసైడ్ చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్తో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా అంగన్వాడీల డిమాండ్లపై మంత్రులు ఈమేరకు సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీల జీతాలను కూడా పెంచేందుకు సర్కారు సానుకూలంగా ఉందని మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని వెల్లడించారు. సర్కారు స్పందనపై అంగన్వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపాయి. అంగన్ వాడీల మిగితా డిమాండ్లపై కూడా సర్కారుకు నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. కాగా, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు.