Tamilisai Reaction: ‘షర్మిల అరెస్ట్’పై తమిళిసై సీరియస్!

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల కారులో ఉండగానే ఆమె కారును లాక్కెళ్లిన ఘటనపై తెలంగాణ గవర్నర్

  • Written By:
  • Updated On - November 30, 2022 / 11:36 AM IST

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల కారులో ఉండగానే, ఆమె కారును లాక్కెళ్లిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అరెస్టు చేయడంతోపాటు పరిణామాలపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాటి ఘటనలపై తమిళిసై ట్విట్టర్‌ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (PMO), కేంద్ర హోం మంత్రి, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ట్యాగ్ చేశారు.

షర్మిలను అరెస్టు తీరు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిల కారు లోపల ఉన్నప్పుడు, పోలీసులు క్రేన్ తో కారును లాగుతున్న దృశ్యాలు తనను కలవరపెట్టాయని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు. కానీ మహిళా నాయకులను గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఉందని తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వానుద్దేశించి మాట్లాడారు.

టీఆర్ఎస్ నాయకులు వరంగల్ జిల్లాలో తనపై పాదయాత్రపై దాడికి నిరసనగా షర్మిల మంగళవారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కారులోనే బైటాయించడంతో పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్‌ వర్గీయుల దాడిలో ధ్వంసమైన కారులోనే నిరసన తెలిపారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి పలు కేసులు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ పై గవర్నర్ తమిళిసై మాత్రమే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.