దేశంలో మళ్లీ కోవిడ్ మహమ్మారి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా కోవిడ్ రోజువారీ కేసుల్లో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళణ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా విద్యాసంవత్సరంలో తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి ఏర్పడింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది.
అయితే…కోవిడ్ కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కోవిడ్ కేసులు ఇంకా పెరుగుతాయన్న వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలు తెరచుకోవడం కష్టంగా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న ఒక్క రోజు తెలంగాణలో 155 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.