తెలంగాణ కు నిధులు ఇవ్వాలని జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ కోరారు. విభజన చట్టంలోని 10 జిల్లాల ప్రాతిపదికన కాకుండా ప్రస్తుత 33 జిల్లాల లెక్కన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఐజీఎస్టీ పరిహారం రూపంలో 210 కోట్లు రావాలని నిర్మలా సీతారామన్ కు గుర్తు చేశారు.
లక్నోలో జీఎస్టీ మండలి 45వ సమావేశం జరిగింది. దీనిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఐజీఎస్టీ పరిహారంలో తెలంగాణకు రూ.210 కోట్ల నిధులు రావలసి ఉంది. తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను 9 జిల్లాలకు కాకుండా హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలకు ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. అలాగే ఈ నిధులను 2021-22 నుంచి మరో ఐదేళ్లపాటు అందించాలని అడిగారు.
అలాగే బీఆర్జీఎఫ్ నిధులను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలన్నారు. ఇక 2020-21లో 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్ల గ్రాంటును కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్కు ఆయన లేఖ అందించారు.