Telangana Leader: తెలంగాణ తొలితరం నేత సోలిపేట కన్నుమూత

సోలిపేట రామచంద్రారెడ్డి గారి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయింది.

Published By: HashtagU Telugu Desk
Solipeta

Solipeta

సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక (మం) చిట్టాపూర్ గ్రామం. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించిన సోలిపేట గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా పని చేశారు. కాంగ్రెస్, టీడీపీ, లోక్సత్తాతో పని చేసిన సోలిపేట.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

కేసీఆర్ సంతాపం

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనది అని సీఎం తెలిపారు. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు.

సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి గారి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read: NTR Fan Died: ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. విషాదంలో జూనియర్ అభిమానులు!

  Last Updated: 27 Jun 2023, 11:56 AM IST