CM Revanth Vs CM Vijayan : కేరళ సీఎం పినరయి విజయన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో విజయన్, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు. ప్రధాని మోడీతో రహస్య ఒప్పందం ఉండటం వల్లే.. పినరయి విజయన్ కుటుంబ సభ్యులపై ఉన్న కేసులలో ఈడీ, ఇన్కమ్ టాక్స్ విభాగాలు జోక్యం చేసుకోవడం లేదని రేవంత్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కేరళలోని వయనాడ్లో రైతులతో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం(CM Revanth Vs CM Vijayan) మాట్లాడారు. కేరళ సీఎం విజయన్ వయనాడ్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా.. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్కు మద్దతు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘కేరళ సీఎం విజయన్ కమ్యూనిస్టు రూపంలో కనిపించే కమ్యూనలిస్టు. ఆయన సీపీఎంతో పాటు కేరళ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంపై పోరాడుతుంటే.. విజయన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈడీ, ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు సీపీఎం కోసం విజయన్ పనిచేయరు. మణిపూర్లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయినా ప్రధాని, అమిత్ షా అక్కడ పర్యటించలేదు. రాహుల్ గాంధీ స్వయంగా అక్కడికి వెళ్ళి బాధితులను ఓదార్చారు’’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
“దేశంలో రెండు పరివార్ల మధ్య పోరాటం జరుగుతోంది. మోడీ పరివార్లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి పరివార్లో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, వయనాడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు’’ అని రేవంత్ చెప్పారు. వయనాడ్ ప్రజలు రాహుల్గాంధీ వైపే ఉన్నారని కామెంట్ చేశారు. రాహుల్గాంధీపై వయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే తాను తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చానని తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్గాంధీని కోరామని, కానీ ఆయన మాత్రం వయనాడ్వైపే మొగ్గు చూపారని తెలంగాణ సీఎం చెప్పారు. గత ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్గాంధీకి 65% ఓట్లు వచ్చాయని, ఈసారి 75% రావాలన్నారు.