Revanth – Chandrababu : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే గురువారం ఉదయం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఫోన్ కాల్ చేసి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. త్వరలోనే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ ఆకాంక్షించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారానికి తమకు సహకరించాలని చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్(Revanth – Chandrababu) ఈసందర్భంగా కోరారు. కాగా, కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్తానని రేవంత్ బుధవారం రోజు ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి. వైఎస్సార్సీపీ కేవలం 11 చోట్ల గెలిచింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీని టీడీపీ సాధించింది. ఈ నేపథ్యంలో 12న చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ ఏపీ పాలిటిక్స్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. సత్సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణలో వచ్చిన ఫలితాలపై అందుబాటులో ఉన్న వాళ్లతో సమీక్ష చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిందన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్త మద్దతు కూడగట్టామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో గెలుపోటములకు తానే బాధ్యుడినని ఆయన చెప్పారు. ‘‘ఈసారి వచ్చిన తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడిలా స్వీకరిస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనం. వంద రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి’’ అని సీఎం రేవంత్ తెలిపారు.