తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి ఆలయం పునః ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాల్లో కే చంద్రశేఖర్రావు దంపతులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 20వసారి యాదాద్రికి వస్తున్న కేసీఆర్.. రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకొంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ఆ తర్వాత రామలింగేశ్వరస్వామివారి నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు.
ఉదయం 10:25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట్ట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం 12:30 గంటలకు మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టనున్నారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్ఠాయాగ పరిసమాప్తి పలుకనున్నారు.