Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. వాస్తవానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన కేబినెట్ సమావేశం కాస్త ఆలస్యం జరిగింది. దీంతో తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది.
ఇకపోతే..ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి, విధానాలపై మంత్రివర్గంలో చర్చించి, క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పెండింగ్ డీఏలపైనా కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గతంలో వివిధ శాఖలకు పంపించిన వీఆర్వోలు, వీఆర్ఏలతో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేయనున్నట్టు సమాచారం. డిజిటల్ కార్డులు, రేషన్ కార్డులపై కూడా చర్చించనున్నారు.