తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, తప్పుల తడకతో జనాలను మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ.. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ కులానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమదైన శైలిలో ఖండిస్తూ కమల దళం అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది.
India Test Vice Captain: టీమిండియా టెస్టు కెప్టెన్గా బుమ్రా.. మరీ వైస్ కెప్టెన్ సంగతేంటి?
ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి (Telangana BJP New President) నియామకం గురించి కీలక ప్రకటన చేసి మరింత ఆసక్తి పెంచారు కిషన్ రెడ్డి (Kishan Reddy). ఆదివారం (ఫిబ్రవరి 16న) వరంగల్లో పర్యటించిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై, మోదీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేతో ఏకీభవించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతునిస్తుందని తెలిపిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు సమర్థిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదింపజేస్తామని కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని.. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సర్వేలు చేయాలని కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి గురించి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని కిషన్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడని స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ వల్ల రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతోందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టేందుకు భయపడుతున్నాయని ఎద్దేవా చేసారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధం ఉందని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని.. ఇప్పుడు ఆయన కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆరోపించారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వనరులు సమకూర్చుకునే అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు కిషన్ రెడ్డి.